ఇన్నాళ్ళూ - మనం మన గురించే ఆలోచించాం మనతో పాటు యితర ప్రాణులు కొన్ని వున్నాయన్న సంగతిని మరిచాం చెట్లను నరికివేస్తుంటే పులులు నగరాల మీద పడవా మరి ? వేటాడి పట్టుకొని తింటుంటే జంతువులు పక్షులు అంతరించిపోవా మరి ? సెల్ ఫోన్ టవర్ల విద్యుత్తరంగాల తాకిడికి పిచ్చుకలన్నీ మచ్చుకు లేకుండా పోయాయి పొలాలపై చల్లే మందులతో చస్తున్నాయి పందులు జంతు కళేబరాలను పీక్కుతొనే రాబందులు సైతం మరణిస్తున్నాయి నేడు కళేబరాలు సైతం విషపూరితం ! మనం మహానగరాలను నిర్మించుకుంటూ కీకారణ్యంలోని ప్రాణులకు ఒకింత చోటు లేకుండా చేస్తున్నాం ఏవీ ఆ పాలపిట్టలు ! ఏవీ ఆ భరద్వాజ పక్షులు ! ఏవీ ఆ ఊరబిచ్చుకలు ! నాగరికుల ధనకాంక్షకు బలై ఆవాసాలను కోల్పోతున్నారు అడవి బిడ్డలు పచ్చని చెట్లను కోల్పోయి పర్యావరణం తలక్రిందు లవుతోంది తోటి ప్రాణులను హింసించిన పాపానికి యిప్పుడు మన ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోంది ! ఏదీ పరిష్కారం ? కాస్త ఆలోచిద్దాం ! ‘నేటి నిజం' - సాహితీ కెరటాలు తేది: 11-10-2012 దినపత్రికలో ప్రచురితం
పూర్వం హర్ష చక్రవర్తి భారత దేశాన్ని పరిపాలించే కాలంలో "హువాన్ సంగ్ "అనే చైనా దేశస్థుడు భారత దేశాన్ని దర్శించేందుకు వచ్చాడు. అతడు భారత దేశంలో వున్న అనేక ప్రదేశాలు తిరిగాడు. అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాడు. భారతీయ సంస్కృతిని అధ్యయనం చేశాడు. అతడు ఎన్నో గ్రంధాలను ఐతిహాసిక వస్తువులను సేకరించాడు.
హువాన్ సంగ్ స్వదేశానికి తిరిగి వెళుతూ, హర్ష చక్రవర్తిని దర్శించి తన అనుభవాలను నివేదించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. హర్షుడు అతని రక్షణార్థం ఇరవై మంది సైనికులను అతని వెంట పంపాడు.
హర్షుడు ప్రయాణారంభ సమయంలో సైనికుల నుద్దేశించి, " సైనికులారా! యితని నౌకలో వివిధ భారతీయ ధర్మశాస్త్ర గ్రంధాలు మరియు అనేక ఐతిహాసిక వస్తువులు వున్నాయి. అవి భారతీయ సంస్కృతికి ప్రతీకలు. చాలా అమూల్యమైనవి. అందువల యితనిని మరియు యీ గ్రంధాలను వస్తువులను పరిరక్షించడం మీ కర్తవ్యం. " అని అన్నాడు.
ప్రయాణం ప్రారంభమైంది. చాలా రోజుల వరకూ ప్రయాణంలో ఎటువంటి అవాంతరం కలుగలేదు. అకస్మాత్తుగా ఒకరోజు సముద్రంలో తుఫాను సంభవించింది. దాని మూలంగా నౌక సముద్రంలో ఊగిసలాడసాగింది. " నావ నీళ్ళలో మునిగిపోతుందో ఏమో ? " అన్న శంక ఉత్పన్న మైంది. ఓడ సరంగు భయకంపితుడై యిలా అరిచాడు " నౌక బరువు అధికమైంది. తొందరగా యీ నావలోని గ్రంధాలను వస్తువులను సముద్రంలోకి విసిరివేసి మీ ప్రాణాలను రక్షించుకోండి "
అప్పుడు సేనాపతి సైనికుల నుద్దేశించి యిలా అన్నాడు " యోధులారా ! ఇది మనకు అగ్ని పరీక్ష. ధర్మశాస్త్ర గ్రంధాలను వస్తువులను , వాటి ద్వారా భారతీయ సంస్కృతిని రక్షించడం మన కర్తవ్యం. అందుకు అందరూ సిద్దంగా వుండండి. ప్రాణాలను అర్పించైనా మనం మన కర్తవ్యాన్ని పాలించాలి. "
నాయకుడి మాటలు విన్న మరుక్షణమే సైనికు లందరూ ఒక్కసారిగా సముద్రంలోకి దుమికారు. భారతీయ సంస్కృతిని రక్షించడం కోసం తమ ప్రాణాలను గడ్డిపోచల వలె త్యాగం చేశారు.
అత్యాశ్చర్యకరమైన యీ దృశ్యాన్ని చూసిన హువాన్ సంగ్ కనులలో అశ్రువులు వుబికాయి.
శ్రీ రామచంద్రునికి రావణునకు మధ్య యుద్ధం సంభవించింది. రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీ రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. అది చూచి విభీషణుడు ఎంతో దు:ఖించాడు. మండోదరి కూడ ఎంతగానో రోదించింది.
రాముడు విభీషణునితో " విభీషణా ! విలపించకు ! రావణుడు వీరస్వర్గ మలంకరించాడు. ఇప్పుడు శవదహన సంస్కార సమయం. అందుకు సిద్ధం చెయ్ ! " అని అన్నాడు.
" రామా ! రావణుడు అధర్మ వర్తనుడు, పరస్త్రీ కాముకుడు, దుష్టుడు, పాపి. అందువలన నేనతనికి శవసంస్కారం చేయను" అని విభీషణుడు పలికాడు.
" విభీషణా ! " మరణాంతం వైరం ". అంటే మరణం వరకే శత్రుత్వం ఉంటుంది. మరణం తరువాత శత్రుత్వం అనుచితం, ధర్మ విరుద్ధం. ఇప్పుడు రావణుడు మృతి చెంది యున్నాడు. అతని కొడుకు లందరూ కూడ మరణించారు. కుంభకర్ణుడు కూడ మృతి చెందాడు. కనుక రావణుని శవదహన సంస్కారాలు నీవే చేయాలి. " అని శ్రీ రాముడు పలికాడు.
విభీషణుడు " రామా ! ఐననూ రావణుడు పాపి......."
రాముడు గంభీర స్వరంతో " విభీషణా ! " మరణాంతం వైరం" . అందువలన నాకు కూడ ఇప్పుడు రావణుని విషయంలో శత్రుత్వం లేదు. అతడు నీకెలా సోదరుడో, నాకూ అలాగే. ఒకవేళ నీవు చేయకపోతే అతనికి శవసంస్కారం నేనే పూర్తిచేస్తాను" అని పలికాడు.
విభీషణుడు శ్రీరామునికి అంజలి ఘటిస్తూ అన్నాడు " క్షమించండి. నేను శవదహనసంస్కారం చేస్తాను. రామా ! నీ ధర్మ దృష్టి అసాధారణం "
ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తం దూరదేశం పోతూ, తన సామానులన్నీ ఒక ఒంటెపై వేసి ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో ఒక ఎడారి వచ్చింది. వైశ్యుని వద్ద ఆహారం స్వల్పంగా వుంది. ఐదురోజులు గడిచాయి. ఆహారం పూర్తిగా ఐపోయింది. వైశ్యుడు దేవుణ్ణి ప్రార్థించాడు, " దేవుడా ! నాకు ఆహారాన్ని ప్రసాదించు !" పదిరోజులు గడచిపోయాయి. వైశ్యునికి ఆహారం లభించలేదు. తనతో తెచ్చుకున్న నీరు కూడ ఐపోయింది. ఎక్కడా నీటి జాడ లేదు. ఎటు చూచినా ఇసుకే. ఎండ మండిపోతోంది.
వైశ్యుడు దీనంగా " దేవుడా ! నీరు లేదు, అన్నం లేదు. కరుణించి ప్రసాదించు !" అని వేడుకున్నాడు.
మూడు రోజులు గడిచాయి. వైశ్యుడు ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేక పోతున్నాడు. అతడు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టాడు. " నీవు భక్తప్రియుడవు గాదు. నీ హృదయం కఠినం. తాగడానికి నీరు కూడ నీ వివ్వడం లేదు. "
ఇంకా మూడు రోజులు గడిచాయి. వైశ్యుని కాళ్ళలో చేతుల్లో శక్తి పూర్తిగా నశించిపోయింది. ఒంటె ఇసుకలో కూలబడి వుంది. దాహంతో అది దీనంగా చుట్టూ పరికిస్తోంది. వైశ్యుని హృదయం కరుణతో నిండిపోయింది. అతడు ఇలా చింతించాడు " నే నింతవరకు నా విషయమే ఆలోచించాను. ఈ ఒంటె నన్ను మోస్తూ నాకు సేవ చేస్తోంది. ఇప్పుడు ఇది మరణావస్థలో వుంది. దేవుడా ! అనుగ్రహించు ! లేకుంటే మా చావు ఖాయం !"
అంతలోనే దూరంగా నీటి శబ్దం వినిపించింది. వైశ్యుడు కష్టంగా లేచి నిలబడి నీటి శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఒంటెను కూడ తనతో తీసికెళ్ళాడు. దానికి నీరు త్రాగించి, తను కూడ దాహం తీర్చుకున్నాడు. సమీపంలో కనిపించిన పళ్ళని తిన్నాడు. ఒంటెకు కూడ ఆహారాన్ని అందించాడు.
స్వార్థచింతనా పరుడైన వాడిని దేవుడెప్పుడూ అనుగ్రహించడు. పరహితం అభిలషించే వారిని మాత్రం తప్పక అనుగ్రహిస్తాడు.
రాష్ట్రకూట వంశంలో జన్మించిన నృపతుంగుడు చక్రవర్తి, గుణశీలుడు మరియు న్యాయనిష్థ గలవాడు. న్యాయ మార్గంలో రాజు ప్రజలు అందరూ సమానులే అని అతని అభిప్రాయం. నృపతుంగుని కుమారుడు కృష్ణుడు. అతడు కోపిష్ఠి. తండ్రిని నిందిస్తూ ప్రజలను పీడించే వాడు. ఎప్పుడూ దుర్జన సాంగత్యంలోనే కాలం గడిపేవాడు.
అతడు ప్రౌఢ వయస్కుడవగానే శత్రుపక్షపు రాజు కుమార్తెను వివాహమాడి , వారి ప్రోద్బలంతో తండ్రి రాజ్యంపైనే దండెత్తాడు. నృపతుంగుడు ధీరుడు, శూరుడు. యుద్ధంలో కృష్ణుడు ఓడిపోయి , బందీగా చిక్కాడు. న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. రాజు న్యాయాధీశుడు, కృష్ణుడు అపరాధి. ' తీర్పు ఎలా ఉంటుందో' అని ప్రజలంతా కుతూహలంతో ఉన్నారు. 'నేను అపరాధినే' అని కృష్ణుడు అంగీకరించి, పశ్చాత్తాప పడ్దాడు. కృష్ణుడు స్వరాజ్య ద్రోహి కాబట్టి అతనికి మరణ దండనే యుక్తం అని రాజు తీర్పు నిచ్చాడు. ప్రజలంతా మౌనంగా వుండిపోయారు. " రాజు కొక్కడే కుమారుడు. అతడు లేకపోతే రాజ్యంలో అరాచకం ప్రబలొచ్చు. కాబట్టి అతడు జీవించి ఉండాలి" అని ప్రజలు కోరుకున్నారు. కుమారుణ్ణి క్షమించమని వారు రాజును ప్రార్థించారు. కాని రాజు అందుకు ఒప్పుకోలేదు.
చివరికి ప్రజల ఒత్తిడితో రాజు యువరాజును క్షమించి, " కుమారా! ప్రజలే నీకు ప్రాణభిక్ష పెట్టారు. కాబట్టి ప్రజా సేవయే నీ ప్రథమ కర్తవ్యం" అని అన్నాడు. అనతి కాలంలోనే కృష్ణుడు ప్రజలను వాత్సల్యంతో పరిపాలిస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.
పూర్వం కళింగ రాజ్యానికి రాజు సత్యగుప్తుడు. అతని కుమారుడు కమలాపీడుడు. అతడు ఎన్నో విద్యల నభ్యసించిన బుద్ధిశాలి. కాని కొంచెం అహంకారి కూడ. అతడు ఎల్లప్పుడు మహారాజునే పరిహసించేవాడు.
రాజు వివేకి. తన కుమారుని అవివేకాన్ని గ్రహించి మనసులో బాధపడుతూ వుండే వాడు.
రాజు వద్ద గొప్ప సైన్యం వుండేది. ఒకమారు యువరాజు సైన్యం విషయంలో తండ్రితో ఇలా అన్నాడు " నాయనా! ఈ సైన్యం వల్ల ఏమి ప్రయోజనం? వీరిని పోషించడానికి అయ్యే ఖర్చువ్యర్థం."
రాజు యిలా అన్నాడు" కుమారా! యుద్ద సమయంలో సైన్యం అత్యావశ్యకం. అందువల్ల సైనికులను ఎల్లప్పుడూ పోషిస్తూ వుండాల్సిందే! అప్పుడు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి రాజ్యాన్ని రక్షిస్తారు. "
దానికి యువరాజు గర్వంగా" యుద్దం ఆసన్నమైనప్పుడు ధనం యిస్తే ఎంతో మంది సైనికులు లభిస్తారు గదా! అన్నం కొరకు కాకులు ఎలా గుంపులు గుంపులుగా వచ్చి చేరతాయో అలా ధనం కోసం ప్రజలు వచ్చి చేరుతారు. " అని అన్నాడు. మహారాజు మౌనంగా వుండి పోయాడు.
రాజు ఆరోజు రాత్రి యువరాజును ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడ అన్నాన్ని నేలపై వుంచి, తన కుమారునితో " కుమారా! ఏదీ యిప్పుడు కాకులను పిలువ్!" అని అన్నాడు
"రాత్రిపూట కాకులెలా వస్తాయి? మీరేమైనా మూర్ఖులా ?" అని యువరాజు ప్రశ్నించాడు.
" కుమారా! నేను మూర్ఖుడిని కాను. నీ అవివేకాన్ని తొలగించడానికే నేనిలా చేశాను. ఎలా ఇప్పుడు అన్నం కోసం కాకులు రావో , అలాగే యుద్దం వచ్చినప్పుడు ధనం యిచ్చినా కూడ సైనికులు ఎవరూ రారు. కనుక దేశాన్ని రక్షించుకోవడం కోసం ఎల్లవేళలా సైనికులను కాపాడుకోవాలి. " అని మహారాజు యువరాజు కుపదేశించి, అతని అవివేకాన్ని తొలగించాడు.
ఈ రోజు "హైదరాబాద్ స్టడీ సర్కిల్ " హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం వారు జయంతి త్రైమాసిక పత్రిక - సామల సదాశివ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ముందు మాటలో సంపాదకులు శ్రీ వెలిచాల కొండల రావుగారు, శ్రీ కె. జితేందర్ బాబు గారు "ఈ సంచికను వెలువరించడంలో మేము ఆశించిన లక్ష్యం సదాశివ బహుముఖీనత్వాన్ని ఇంతవరకు తెలియని మన పాఠకులకు తెలియ జెప్పాలని మాత్రమే మా ప్రయత్నం" అని చెప్పుకున్నారు.
ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఉర్దూ సాహిత్యాన్ని గురించి, హిందుస్తానీ సంగీతం గురించి శ్రీ సదాశివ వ్రాసిన కొన్ని వ్యాసాలను చేర్చారు. రెండవ భాగంలో సదాశివ సాహిత్యంపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు, సదాశివ వ్రాసిన కొన్ని లేఖలను ప్రచురించారు. ఇక మూడవ భాగంలో సదాశివతో జరిపిన ఇంటర్వ్యూ ; అందులో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించారు.
రమణజీవి కవర్ డిజైన్ చేయగా, అన్నవరం శ్రీనివాస్ కవర్ పెయింటింగ్ వేశారు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో శ్రీ బి. నరసింగరావు గారు, శ్రీమతి రావు బాలసరస్వతి గారు, అమ్మంగి వేణుగోపాల్ గారు, ఎలనాగ గారు, నాగరాజు రామస్వామి గారు, వి. ఆర్. విద్యార్థి గారు, దేవిప్రియ మొదలైన వాళ్ళున్నారు."నేనెరిగిన సదాశివ" అనే వ్యాసాన్ని అందించిన రావు బాల సరస్వతి సభాధ్యక్షులు శ్రీ పేర్వారం రాములు మరియు ఇతర పెద్దల కోరిక మేరకు రెండు గీతాల్లోని ( “నిండు పున్నమి పండు వెన్నెలలో "... మరియు "ఆ తోటలో నొకటి ఆరాధనాలయము ".. ) కొన్ని చరణాలు ఆలపించి ఆహుతులను అలరించారు.
" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "
ఒక భిక్షుక సన్యాసి వుండేవాడు. అతడు ప్రతిదినం తనకు దొరికిన అన్నాన్ని భుజిస్తూ, దానం చేసిన ధనాన్ని ఒక రాగిచెంబులో దాచివుంచేవాడు. అలా కొంత కాలానికి ఆ రాగిచెంబు ధనంతో నిండిపోగానే, అతడు తన చిరకాల వాంఛ ననుసరించి, విశ్వనాథుని దర్శనార్థం కాశీకి ప్రయాణమై, అక్కడికి చేరుకున్నాడు.
అతడు మొదట గంగానదిలో స్నానం చేసి, తరువాత దేవుడిని దర్శించాలనుకున్నాడు. "కాని రాగిచెంబును ఎక్కడ దాచడం !?" ఒడ్డున వుంచితే ఎవడైనా దొంగ దానిని తస్కరిస్తాడేమో నని భయపడి, ఇసుకలో గుంతను త్రవ్వి, అందులో రాగిచెంబును వుంచి, దానిపై ఇసుకను కప్పాడు. " కాని, స్నానం చేసి, ఒడ్డుకు వచ్చిన తరువాత, దాని నెలా గుర్తు పట్టడం !? " అతడు ఆలోచించి ఉపాయంతో, దానిపై ఒక ఇసుక లింగాన్ని తయారుచేసి గుర్తుగా వుంచి, గంగానదిలో స్నానం చేయసాగాడు.
ఇంతలో ఒక భక్తుడు అక్కడికి వచ్చి, ఒడ్డున ఇసుక లింగాన్ని వుంచి, గంగానదిలో స్నానమాడుతున్న సన్యాసిని చూసి, అలా చేయడం అక్కడి కాశీ సాంప్రదాయమేమో అనుకొని, తను కూడ ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి ఒడ్డున వుంచి, గంగలో స్నానం చేయసాగాడు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న వేలాది భక్తులు తాము కూడ అలాగే ఒడ్డున ఇసుక లింగాలను వుంచి, గంగానదిలో స్నానం చేయసాగారు.
సన్యాసి స్నానానంతరం ఒడ్డుకు రాగానే, అతనికి కొన్ని వేల ఇసుక లింగాలు దర్శనమిచ్చాయి. అందులో తన రాగిచెంబును వుంచిన ఇసుక లింగాన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఆ సన్యాసి చివరకు విచారిస్తూ, ఇలా అన్నాడు.
" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "
ఈ సుభాషితం యొక్క భావం :
లోకం అనుకరిస్తుంది. కాని అందులోని పారమార్థాన్ని గ్రహించదు. అయ్యో ! గంగా తీరపు యీ ఇసుక లింగాలలో నా రాగిచెంబును పోగొట్టుకున్నాను గదా !
ఒకప్పుడు ఒక క్షురకుడు ఉండేవాడు. అతడు ప్రతిదినం రాజమందిరానికి వెళ్ళి, రాజుగారికి ముఖక్షవరం చేసేవాడు. క్షురకుడు మహా శివభక్తుడు. ఉదయాన్నే దైవపూజ చేయకుండా ఏ పనీ మొదలుపెట్టే వాడు కాదు. ఒకరోజు ఆ మంగలి దైవాన్ని ధ్యానిస్తూ కాలాన్ని పూర్తిగా మరచిపోయాడు. సమయానికి మంగలి రాకపోవడం చూసి, రాజు కోపించి భటులను పిలిచి, త్వరగా ఆ మంగలిని తీసుకురండని ఆజ్ఞాపించాడు. ఇంటికి వచ్చిన భటులను చూసి మంగలి భార్య భయపడి, త్వరగా పూజ గదిలోకి వెళ్ళింది వార్తను చెప్పడానికి. కాని అతడు పూర్తిగా ధ్యానమగ్నుడై ఉండడం చూసి అతని ధ్యానాన్ని భగ్నం చేయడం యిష్టం లేక, తిరిగి వెలుపలికి వచ్చి భటులతో "ఆయన యింట్లో లేరు! వచ్చీరాగానే రాజమందిరానికి పంపిస్తాను " అని చెప్పింది. అప్పటికే మంగలిపై అసూయాద్వేష మనస్కులైన రాజభటులు రాజుకు జరిగింది విన్నవించి, మంగలి భార్య అబద్దమాడుతోందని చెప్ఫారు. అది విని రాజు కోపంగా భటులతో "వెంటనే వాడిని తాళ్ళతో కట్టిపడేసి, యిక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు.భటులు ఆనందంతో నృత్యం చేస్తూ మంగలి యింటి వైపు బయలుదేరారు. అప్పుడు పరమేశ్వరుడు భక్త సంరక్షణార్థం, తాను మంగలి వేషం ధరించి, రాజమందిరానికి వెళ్ళాడు. అతనిని చూడడంతోనే రాజుకు కోపం ఉపశమించి, ఏమీ అనలేక పోయాడు. మంగలి రూపంలో నున్న భగవానుడు రాజుకు ముఖక్షవరం చేసి, కొంత సుగంధ తైలాన్ని తెప్పించి రాజుగారికి శరీరమర్దనం చేశాడు. అతని హస్తకౌశలం చూసి రాజు ముగ్ధుడైపోయాడు. తైలపాత్రలో మంగలి నాలుగు చేతులతో కనిపించగా, రాజు విస్మిత సమ్మోహితుడై, అతనికి ఎన్నో బంగారు నాణాలను బహూకరించి పంపివేశాడు. వాటిని స్వీకరించి పరమేశ్వరుడు వెలుపలికి వచ్చి అదృశ్యమైనాడు. ఇంతలో ధ్యానాన్ని చాలించిన మంగలి, తన యింటి వైపు వస్తున్న భటులను గమనించి జరిగిన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే రాజప్రాసాదానికి వెళ్ళి తన ఆలస్యాన్ని మన్నించమని రాజును వేడుకున్నాడు. దాని కారాజు "ఏమయ్యా! ఇప్పుడే గదా నాకు గెడ్డం గీసి వెళ్ళావు. తిరిగి వచ్చి ఎందుకు నన్ను క్షమాపణను వేడుతున్నావు?" అని ప్రశ్నించాడు. " ఏదీ ! నీ చతుర్భుజ రూపం మళ్ళీ ఒకమారు ప్రదర్శించు! చూడాలని వుంది " అని కూడ అన్నాడు. అది విని మంగలి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే తన రూపంలో వచ్చి రాజుకు ముఖక్షవరం చేశాడని గ్రహించి, " హే! భగవాన్! నన్ను రాజదండనం నుండి తప్పించడానికే నీవు నా రూపంలో వచ్చి, రాజుకు ముఖక్షవరం, శరీరమర్దనం చేశావు గదా! కాని రాజుకు నీ దర్శనభాగ్యం కలిగించి నాకెందుకు ఆ భాగ్యాన్ని కలిగించలేదు " అని చింతించాడు. అప్పుడు దయామయుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, మంగలి ముందు ప్రత్యక్షమై అతనికి తన దర్శనభాగ్యం కలిగించాడు.
'''పండిట్ కుమార గంధర్వ''' (శివపుత్ర సిద్ధరామయ్య కోంకళి) ఏప్రిల్ 8, 1924 న కర్ణాటక రాష్టంలోని బెల్గాం జిల్లాలోని సులేభావి గ్రామంలో జన్మించాడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు కుమార గంధర్వ . "కుమార గంధర్వ" అనే బిరుదు ఆయనకు చిన్నతనంలోనే బహూకరించబడింది. హిందూ పురాణాల్లో గంధర్వుడు సంగీతానికి ఆద్యుడైన దివ్యపురుషుడు.
==జీవిత విశేషాలు== ఆయన చిన్నతనంలో కుమార గంధర్వకు సంగీతంలో ప్రొఫెసర్ బి.ఆర్. డియోధర్ నుండి శిక్షణ లభించింది. 1947 లో భానుమతి కాన్స్ను వివాహమాడి, మధ్యప్రదేశ్ లోని "దివాస్" కు మకాం మార్చాడు. అక్కడే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ సోకగా, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మళ్ళీ "ఋణానుబంధాచ్య" వంటి మరాఠీ గీతాలు పాడినా, ఊపిరి అందక, మునుపటిలాగా పాడలేకపోయాడు. కుమార గంధర్వ నిర్గుణి భజనలు జానపద గీతాలు, రాగాలు ఒక విశిష్ట శైలిలో పాడేవాడు. కొందరు ఆయన పాడే విలంబిత్ గాయన పద్ధతిని విమర్శించినా, ద్రుపద్ గాయనాన్ని మెచ్చుకొనేవారు. 1961 లో భానుమతి మరణం తరువాత, కుమార గంధర్వ తన సహ విద్యార్థిని, ''వసుంధరా శ్రీఖండే"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె కుమార గంధర్వ తో కలిసి భజనలు పాడేది. వారి కుమార్తె కలాపిని కోంకళి వారికి తాన్పురా వాయించేది. ఆయన శిష్యులలో ముఖ్యులు సత్యశీల్ దేశ్ పాండే మరియు శుభా ముద్గల్ లు. కుమార గంధర్వకు 1990 లో పద్మవిభూషణ్ అవార్డ్ లభించింది.
( ఈ రోజు అంటే జనవరి 12, పండిత్ కుమార్ గంధర్వ వర్ధంతిని పురస్కరించుకొని )
'''సవాయి గంధర్వ సంగీత మహోత్సవం''' : భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి " ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా, పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత్సవం సవాయి గంధర్వ జీవితం, సంగీతపరంగా ఆయన సాధించిన విజయాల జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది. డిశంబరు, 2002 లో ఈ ఉత్సవం స్వర్ణోత్సవాలను జరుపుకొంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఈ ఉత్సవం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగివుంది. గత యాభై ఏళ్ళుగా, పుణె నగర సంగీతాభిమానులు, విఖ్యాత హిందుస్తానీ సంగీత కళాకారుల మరపురాని కచేరీలను ఈ ఉత్సవాలో విని ఆనందిస్తున్నారు.
==చరిత్ర== సవాయి గంధర్వ సంగీత మహోత్సవం, హిందుస్తానీ సంగీత చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, హిందుస్తానీ సంగీతం రాజుల "ఆస్థాన సంగీత విద్వాంసుల సాంప్రదాయం" మూలంగా బ్రతికింది. స్వాతంత్ర్యానంతరం, హిందుస్తానీ సంగీతం భారత్, పాకిస్తాన్ లతో పాటే చీలిపోయి, అటు పాకిస్తాన్, ఇటు భారత దేశం ఎందరో ప్రజ్ఞావంతులయిన సంగీత కళాకారుల్ని కోల్పోయాయి. కొత్త రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, ఎలా తమ సంగీతం నిలదొక్కుకుంటుందో అని విచారించి, ఎందరో సంగీత కళాకారులు తమ కళను బ్రతికించుకోవడానికి ఎన్నో సంగీత కచేరీల నిస్తుండేవారు. ఈ సవాయి గంధర్వ సంగీత మహోత్సవం కళాకారుల నందరినీ సంఘటితంగా, ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలను నిత్యనూతనంగా ప్రవేశపెడుతోంది.
ఈ సంగీతోత్సవాల్లో ఇంతవరకు పాల్గొన్నవర్ధమాన మరియు మేటి కళాకారులు : హీరాబాయి బరోడేకర్, డా. వసంతరావు దేశ్పాండె, బేగం అక్తర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాకిర్ హుసేన్ (సంగీతకారుడు), సరస్వతి రాణె, ఉస్తాద్ అహ్మద్జాన్ తిరఖ్వా, కుమార గంధర్వ, కిశోరి అమోంకర్, పండిట్ భీమ్ సేన్ జోషి లు. ఇంకా, అరుణా సాయిరాం, (కర్ణాటక సంగీతం), గణేశ్ కుమరేశ్ లు (వయొలిన్), పండిట్ జస్రాజ్, పండిట్ అజయ్ చక్తవర్తి, మాలిని రాజూర్కర్, పండిట్ రాజన్ సాజన్ మిశ్రా లు (గాత్రం), శ్రీనివాస్ జోషి, పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్), రోను మజుందార్ (ఫ్లూట్), అనుజ్, స్మృతి మిశ్రా లు (కథక్).
==సాంప్రదాయం== ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం డిశంబర్, మొదటి రెండు వారాల్లో, మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. ప్రతి కళాకారుడీకీ, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంలో పాల్గొనడం అంటే, ఒక గొప్ప సన్మానంతో కూడుకొన్న అవకాశం. ఈ వేదికపై ఎందరో వర్ధమాన కళాకారులు పరిచయం చేయబడ్డారు. చివరి రోజు ఆఖరున, పండిట్ భీంసేన్ జోషి గాత్రకచేరీ ఉండడం, ఈ ఉత్సవ సాంప్రదాయం. కచేరీ తరువాత అబ్దుల్ కరీంఖాన్ ప్రాశస్త్యానికి తీసుకు వచ్చిన, "భైరవి ఠుమ్రి" రాగం - ''జమునా కే తీర్'' - పండిట్ సవాయి గంధర్వ పాడిన రికార్డును వేయగా, వేలాది శ్రోతలు విని ఆనందిస్తారు.
( రేపటి నుండి, అంటే జనవరి 7 నుండి జనవరి 10, 2010 వరకు పుణె నగరంలో సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ వ్యాసం పున:ప్రచురణ )
Almighty
-
Almighty
- Nagaraju Raveender • Palaparti Indrani
The glowing fish
At the bottom of the sea
The twirling baby
Within the womb
The blood- tinged
C...