ఇన్నాళ్ళూ -
మనం మన గురించే ఆలోచించాం
మనతో పాటు యితర ప్రాణులు కొన్ని
వున్నాయన్న సంగతిని మరిచాం
చెట్లను నరికివేస్తుంటే
పులులు నగరాల మీద పడవా మరి ?
వేటాడి పట్టుకొని తింటుంటే
జంతువులు పక్షులు అంతరించిపోవా మరి ?
సెల్ ఫోన్ టవర్ల విద్యుత్తరంగాల తాకిడికి
పిచ్చుకలన్నీ మచ్చుకు లేకుండా పోయాయి
పొలాలపై చల్లే మందులతో
చస్తున్నాయి పందులు
జంతు కళేబరాలను పీక్కుతొనే
రాబందులు సైతం మరణిస్తున్నాయి
నేడు కళేబరాలు సైతం విషపూరితం !
మనం మహానగరాలను నిర్మించుకుంటూ
కీకారణ్యంలోని ప్రాణులకు
ఒకింత చోటు లేకుండా చేస్తున్నాం
ఏవీ ఆ పాలపిట్టలు !
ఏవీ ఆ భరద్వాజ పక్షులు !
ఏవీ ఆ ఊరబిచ్చుకలు !
నాగరికుల ధనకాంక్షకు బలై
ఆవాసాలను కోల్పోతున్నారు అడవి బిడ్డలు
పచ్చని చెట్లను కోల్పోయి
పర్యావరణం తలక్రిందు లవుతోంది
తోటి ప్రాణులను హింసించిన పాపానికి
యిప్పుడు మన ఉనికికే ప్రమాదం
ముంచుకొస్తోంది !
ఏదీ పరిష్కారం ?
కాస్త ఆలోచిద్దాం !
‘నేటి నిజం' - సాహితీ కెరటాలు తేది: 11-10-2012 దినపత్రికలో ప్రచురితం