శ్రీ రామచంద్రునికి రావణునకు మధ్య యుద్ధం సంభవించింది. రావణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. అప్పుడు శ్రీ రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో రావణుడు మరణించాడు. అది చూచి విభీషణుడు ఎంతో దు:ఖించాడు. మండోదరి కూడ ఎంతగానో రోదించింది.
రాముడు విభీషణునితో " విభీషణా ! విలపించకు ! రావణుడు వీరస్వర్గ మలంకరించాడు. ఇప్పుడు శవదహన సంస్కార సమయం. అందుకు సిద్ధం చెయ్ ! " అని అన్నాడు.
" రామా ! రావణుడు అధర్మ వర్తనుడు, పరస్త్రీ కాముకుడు, దుష్టుడు, పాపి. అందువలన నేనతనికి శవసంస్కారం చేయను" అని విభీషణుడు పలికాడు.
" విభీషణా ! " మరణాంతం వైరం ". అంటే మరణం వరకే శత్రుత్వం ఉంటుంది. మరణం తరువాత శత్రుత్వం అనుచితం, ధర్మ విరుద్ధం. ఇప్పుడు రావణుడు మృతి చెంది యున్నాడు. అతని కొడుకు లందరూ కూడ మరణించారు. కుంభకర్ణుడు కూడ మృతి చెందాడు. కనుక రావణుని శవదహన సంస్కారాలు నీవే చేయాలి. " అని శ్రీ రాముడు పలికాడు.
విభీషణుడు " రామా ! ఐననూ రావణుడు పాపి......."
రాముడు గంభీర స్వరంతో " విభీషణా ! " మరణాంతం వైరం" . అందువలన నాకు కూడ ఇప్పుడు రావణుని విషయంలో శత్రుత్వం లేదు. అతడు నీకెలా సోదరుడో, నాకూ అలాగే. ఒకవేళ నీవు చేయకపోతే అతనికి శవసంస్కారం నేనే పూర్తిచేస్తాను" అని పలికాడు.
విభీషణుడు శ్రీరామునికి అంజలి ఘటిస్తూ అన్నాడు " క్షమించండి. నేను శవదహనసంస్కారం చేస్తాను. రామా ! నీ ధర్మ దృష్టి అసాధారణం "
ధర్మమూర్తి శ్రీ రామచంద్రునికి ప్రణామములు.
0 వ్యాఖ్యలు:
Post a Comment