నా గురించి

Monday, April 25, 2011

సత్య సాయి




అపర భాగీరథుడు సాయి ; అనవరతము
మానవాభ్యుదయమ్ముకై మనిన వాడు,
శాంతి సత్య అహింసల చాటినాడు;
మరణమందిన వాడె యమరు డనదగు.

Monday, April 18, 2011

పట్టుకాయ కవిత్వం

అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.

తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.

జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.

అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.

* ఈ కవిత "పాలపిట్ట" మాసపత్రిక ( ఏప్రిల్ '2011 ) లో ప్రచురింపబడింది.

Monday, April 4, 2011

ఉగాదీ ! కొత్త వత్సరమా !




ఖర నామ వత్సరమ్మా !
అరుగుము ప్రతి యింట నీవు ఆనందముగా !
వరముల దాయివి, సురభివి
కరము శుభములను యొసంగి , కమ్ము శుభ"ఖరా" !

Wednesday, March 24, 2010

శ్రీ రామా !


రామా ! గుణాభిరామా !
రామా ! కోదండ రామ ! రఘుకుల సోమా !
రామా ! శ్రీ రఘు రామా !
రామా ! సీతా సమేత రాఘవ నామా !

Sunday, February 28, 2010

ప్రెషర్ కుక్కర్


నీళ్ళు సలసలా కాగి
మరిగి ఆవిరైపోయి
కుక్కర్ ఇనుప గోడల్ని
అతలాకుతలం చేస్తూ
చివరికి -
ఒక చిన్న రంధ్రం ద్వారా
బయటికి చిమ్ముకొస్తున్న దృశ్యం

ఒక పీడనంలో నుండి వెలువడ్డ
ఒక ఉచ్చస్థాయి కేక.

పీడనం ఎక్కువైపోతే
ఏదో ఒక రోజు
ప్రెషర్ కుక్కర్ బాంబులా
బద్ధలవడం తప్పదు

Monday, February 15, 2010

సెల్‌ఫోన్ యువత




సెల్లులోనె కళ్ళు చేతిలొ చార్జరు
వాడు యెపుడు మాటలాడు చుండు !
బిల్లు పెరుగుతున్న - బింకమ్ము చూపక
సెల్లులోనె వాడు త్రుళ్ళు చుండు !

Sunday, February 14, 2010

భక్త సేవకుడు


ఒకప్పుడు ఒక క్షురకుడు ఉండేవాడు. అతడు ప్రతిదినం రాజమందిరానికి వెళ్ళి, రాజుగారికి ముఖక్షవరం చేసేవాడు. క్షురకుడు మహా శివభక్తుడు. ఉదయాన్నే దైవపూజ చేయకుండా ఏ పనీ మొదలుపెట్టే వాడు కాదు.
ఒకరోజు ఆ మంగలి దైవాన్ని ధ్యానిస్తూ కాలాన్ని పూర్తిగా మరచిపోయాడు. సమయానికి మంగలి రాకపోవడం చూసి, రాజు కోపించి భటులను పిలిచి, త్వరగా ఆ మంగలిని తీసుకురండని ఆజ్ఞాపించాడు. ఇంటికి వచ్చిన భటులను చూసి మంగలి భార్య భయపడి, త్వరగా పూజ గదిలోకి వెళ్ళింది వార్తను చెప్పడానికి. కాని అతడు పూర్తిగా ధ్యానమగ్నుడై ఉండడం చూసి అతని ధ్యానాన్ని భగ్నం చేయడం యిష్టం లేక, తిరిగి వెలుపలికి వచ్చి భటులతో "ఆయన యింట్లో లేరు! వచ్చీరాగానే రాజమందిరానికి పంపిస్తాను " అని చెప్పింది.
అప్పటికే మంగలిపై అసూయాద్వేష మనస్కులైన రాజభటులు రాజుకు జరిగింది విన్నవించి, మంగలి భార్య అబద్దమాడుతోందని చెప్ఫారు.
అది విని రాజు కోపంగా భటులతో "వెంటనే వాడిని తాళ్ళతో కట్టిపడేసి, యిక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు.భటులు ఆనందంతో నృత్యం చేస్తూ మంగలి యింటి వైపు బయలుదేరారు.
అప్పుడు పరమేశ్వరుడు భక్త సంరక్షణార్థం, తాను మంగలి వేషం ధరించి, రాజమందిరానికి వెళ్ళాడు. అతనిని చూడడంతోనే రాజుకు కోపం ఉపశమించి, ఏమీ అనలేక పోయాడు. మంగలి రూపంలో నున్న భగవానుడు రాజుకు ముఖక్షవరం చేసి, కొంత సుగంధ తైలాన్ని తెప్పించి రాజుగారికి శరీరమర్దనం చేశాడు. అతని హస్తకౌశలం చూసి రాజు ముగ్ధుడైపోయాడు. తైలపాత్రలో మంగలి నాలుగు చేతులతో కనిపించగా, రాజు విస్మిత సమ్మోహితుడై, అతనికి ఎన్నో బంగారు నాణాలను బహూకరించి పంపివేశాడు. వాటిని స్వీకరించి పరమేశ్వరుడు వెలుపలికి వచ్చి అదృశ్యమైనాడు.
ఇంతలో ధ్యానాన్ని చాలించిన మంగలి, తన యింటి వైపు వస్తున్న భటులను గమనించి జరిగిన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే రాజప్రాసాదానికి వెళ్ళి తన ఆలస్యాన్ని మన్నించమని రాజును వేడుకున్నాడు.
దాని కారాజు "ఏమయ్యా! ఇప్పుడే గదా నాకు గెడ్డం గీసి వెళ్ళావు. తిరిగి వచ్చి ఎందుకు నన్ను క్షమాపణను వేడుతున్నావు?" అని ప్రశ్నించాడు. " ఏదీ ! నీ చతుర్భుజ రూపం మళ్ళీ ఒకమారు ప్రదర్శించు! చూడాలని వుంది " అని కూడ అన్నాడు.
అది విని మంగలి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే తన రూపంలో వచ్చి రాజుకు ముఖక్షవరం చేశాడని గ్రహించి, " హే! భగవాన్! నన్ను రాజదండనం నుండి తప్పించడానికే నీవు నా రూపంలో వచ్చి, రాజుకు ముఖక్షవరం, శరీరమర్దనం చేశావు గదా! కాని రాజుకు నీ దర్శనభాగ్యం కలిగించి నాకెందుకు ఆ భాగ్యాన్ని కలిగించలేదు " అని చింతించాడు.
అప్పుడు దయామయుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, మంగలి ముందు ప్రత్యక్షమై అతనికి తన దర్శనభాగ్యం కలిగించాడు.

మూలం : సంస్కృత కథానిక " భక్త సేవక: "

Thursday, January 28, 2010

నిశ్శబ్దం


గంట నుంచీ నాతో
మాట్లాడుతున్నావు ఫోన్లో ఏదో !
ఒక్క క్షణం నిశ్శబ్దం -
అప్పుడర్థమైంది ...
నువ్వు చెప్పదలచు కున్నదేమిటో !

Tuesday, January 12, 2010

పండిట్ కుమార గంధర్వ


'''పండిట్ కుమార గంధర్వ''' (శివపుత్ర సిద్ధరామయ్య కోంకళి) ఏప్రిల్ 8, 1924 న కర్ణాటక రాష్టంలోని బెల్గాం జిల్లాలోని సులేభావి గ్రామంలో జన్మించాడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు కుమార గంధర్వ . "కుమార గంధర్వ" అనే బిరుదు ఆయనకు చిన్నతనంలోనే బహూకరించబడింది. హిందూ పురాణాల్లో గంధర్వుడు సంగీతానికి ఆద్యుడైన దివ్యపురుషుడు.

==జీవిత విశేషాలు==
ఆయన చిన్నతనంలో కుమార గంధర్వకు సంగీతంలో ప్రొఫెసర్ బి.ఆర్. డియోధర్ నుండి శిక్షణ లభించింది. 1947 లో భానుమతి కాన్స్‌ను వివాహమాడి, మధ్యప్రదేశ్ లోని "దివాస్" కు మకాం మార్చాడు. అక్కడే ఆయనకు ఊపిరితిత్తుల కాన్సర్ సోకగా, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మళ్ళీ "ఋణానుబంధాచ్య" వంటి మరాఠీ గీతాలు పాడినా, ఊపిరి అందక, మునుపటిలాగా పాడలేకపోయాడు. కుమార గంధర్వ నిర్గుణి భజనలు జానపద గీతాలు, రాగాలు ఒక విశిష్ట శైలిలో పాడేవాడు. కొందరు ఆయన పాడే విలంబిత్ గాయన పద్ధతిని విమర్శించినా, ద్రుపద్ గాయనాన్ని మెచ్చుకొనేవారు. 1961 లో భానుమతి మరణం తరువాత, కుమార గంధర్వ తన సహ విద్యార్థిని, ''వసుంధరా శ్రీఖండే"ను వివాహం చేసుకొన్నాడు. ఆమె కుమార గంధర్వ తో కలిసి భజనలు పాడేది. వారి కుమార్తె కలాపిని కోంకళి వారికి తాన్‌పురా వాయించేది. ఆయన శిష్యులలో ముఖ్యులు సత్యశీల్ దేశ్ పాండే మరియు శుభా ముద్గల్ లు. కుమార గంధర్వకు 1990 లో పద్మవిభూషణ్ అవార్డ్ లభించింది.


( ఈ రోజు అంటే జనవరి 12, పండిత్ కుమార్ గంధర్వ వర్ధంతిని పురస్కరించుకొని )

పండిత్ కుమార్ గంధర్వ పాడిన రాగాలు , గీతాలు

Wednesday, January 6, 2010

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం


'''సవాయి గంధర్వ సంగీత మహోత్సవం''' : భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి " ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా,
పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత్సవం సవాయి గంధర్వ జీవితం, సంగీతపరంగా ఆయన సాధించిన విజయాల జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది.
డిశంబరు, 2002 లో ఈ ఉత్సవం స్వర్ణోత్సవాలను జరుపుకొంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఈ ఉత్సవం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగివుంది. గత యాభై ఏళ్ళుగా, పుణె నగర సంగీతాభిమానులు, విఖ్యాత హిందుస్తానీ సంగీత కళాకారుల మరపురాని కచేరీలను ఈ ఉత్సవాలో విని ఆనందిస్తున్నారు.

==చరిత్ర==
సవాయి గంధర్వ సంగీత మహోత్సవం, హిందుస్తానీ సంగీత చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, హిందుస్తానీ సంగీతం రాజుల "ఆస్థాన సంగీత విద్వాంసుల సాంప్రదాయం" మూలంగా బ్రతికింది. స్వాతంత్ర్యానంతరం, హిందుస్తానీ సంగీతం భారత్, పాకిస్తాన్ లతో పాటే చీలిపోయి, అటు పాకిస్తాన్, ఇటు భారత దేశం ఎందరో ప్రజ్ఞావంతులయిన సంగీత కళాకారుల్ని కోల్పోయాయి. కొత్త రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, ఎలా తమ సంగీతం నిలదొక్కుకుంటుందో అని విచారించి, ఎందరో సంగీత కళాకారులు తమ కళను బ్రతికించుకోవడానికి ఎన్నో సంగీత కచేరీల నిస్తుండేవారు.
ఈ సవాయి గంధర్వ సంగీత మహోత్సవం కళాకారుల నందరినీ సంఘటితంగా, ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలను నిత్యనూతనంగా ప్రవేశపెడుతోంది.

ఈ సంగీతోత్సవాల్లో ఇంతవరకు పాల్గొన్నవర్ధమాన మరియు మేటి కళాకారులు : హీరాబాయి బరోడేకర్, డా. వసంతరావు దేశ్‌పాండె, బేగం అక్తర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాకిర్ హుసేన్ (సంగీతకారుడు), సరస్వతి రాణె, ఉస్తాద్ అహ్మద్‌జాన్ తిరఖ్‌వా, కుమార గంధర్వ, కిశోరి అమోంకర్, పండిట్ భీమ్ సేన్ జోషి లు. ఇంకా, అరుణా సాయిరాం, (కర్ణాటక సంగీతం), గణేశ్ కుమరేశ్ లు (వయొలిన్), పండిట్ జస్‌రాజ్, పండిట్ అజయ్ చక్తవర్తి, మాలిని రాజూర్కర్, పండిట్ రాజన్ సాజన్ మిశ్రా లు (గాత్రం), శ్రీనివాస్ జోషి, పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్), రోను మజుందార్ (ఫ్లూట్), అనుజ్, స్మృతి మిశ్రా లు (కథక్).

==సాంప్రదాయం==
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం డిశంబర్, మొదటి రెండు వారాల్లో, మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. ప్రతి కళాకారుడీకీ, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంలో పాల్గొనడం అంటే, ఒక గొప్ప సన్మానంతో కూడుకొన్న అవకాశం. ఈ వేదికపై ఎందరో వర్ధమాన కళాకారులు పరిచయం చేయబడ్డారు. చివరి రోజు ఆఖరున, పండిట్ భీంసేన్ జోషి గాత్రకచేరీ ఉండడం, ఈ ఉత్సవ సాంప్రదాయం. కచేరీ తరువాత అబ్దుల్ కరీంఖాన్ ప్రాశస్త్యానికి తీసుకు వచ్చిన, "భైరవి ఠుమ్రి" రాగం - ''జమునా కే తీర్'' - పండిట్ సవాయి గంధర్వ పాడిన రికార్డును వేయగా, వేలాది శ్రోతలు విని ఆనందిస్తారు.


( రేపటి నుండి, అంటే జనవరి 7 నుండి జనవరి 10, 2010 వరకు పుణె నగరంలో సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ వ్యాసం పున:ప్రచురణ )

సవాయి గంధర్వ సంగీత మహోత్స వం వెబ్ సైట్

Thursday, December 31, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Monday, December 28, 2009

మిత్రుడు ...

మిత్రుడు ఇస్మాయిలు ఒక
చిత్రపు మనిషే ! నవకము చిత్రము మాత్రం !
మంత్రపు మాటలతో మరి
తంత్రుల నెదలోన మీటు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 23, 2009

స్వరలయలు ( పుస్తక పరిచయం )




రచన : డా. సామల సదాశివ
ప్రచురణ : చెలిమి ఫౌండేషన్
ప్రథమ ముద్రణ : నవంబర్ 2009

ఈ పుస్తకంలో హిందుస్తానీ శాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీతపు ముచ్చట్లు ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు "వార్త" దినపత్రికలో వచ్చాయి వరుసగా. ఈ సంగీత జ్ఞాపకాల ముచ్చట్లు మరికొన్ని ఇదివరకే రెండు పుస్తకాల రూపంలో వచ్చాయి. అవి "మలయమారుతాలు" మరియు "సంగీత శిఖరాలు" .
ఈ "స్వరలయలు" లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి చెందిన వివిధ "ఘరానా "లకు సంబంధించిన వివిధ సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, ఉస్తాద్ అల్లాదియాఖాన్, పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ , పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్, వారి కుమారుడు డి.వి. పలూస్కర్, ఉస్తాద్ బడే గులాం అలిఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, స్వరశ్రీ కేసర్‌బాయి కేర్కర్, గంగూబాయి హంగల్, విదుషి హీరాబాయి బరోడేకర్, అన్నపూర్ణా దేవి ( పండిత్ రవి శంకర్ భార్య ), విదుషి మోగూబాయ్ కుర్దీకర్, కిషోరీ అమోణ్‌కర్, పర్వీన్ సుల్తానా, ప్రభా ఆత్రే, పండిత్ జస్‌రాజ్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ( షహనాయి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ ( సితార్ )... ఇట్లా ఎందరో సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. వారు ఎన్ని కష్టాలను, అవమానాలను సహించి సంగీతాన్ని అభ్యసించినారో, ఎలా పాడినారో చదువుతుంటే, అక్కడక్కడ కళ్ళు చెమర్చుతాయి.

ద్రుపద్, ఖయాల్,ఠుమ్రి, దాద్రా, తాన్, ముర్కీ, మీండ్, వంటి ఎన్నో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతపు పారిభాషిక పదాలను మనము ఇందులో చదివి తెలుసుకుంటాము. మారు బిహాగ్, పట్‌దీప్ , యమన్ కల్యాణ్, భైరవి, పూర్వి వంటి ఎన్నో రాగాల గురించి మనము వింటాము.

ఇవే కాక, సినిమా సంగీతానికి చెందిన కె.ఎల్.సైగల్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, సోను నిగం గురించిన ముచ్చట్లు ఉన్నాయి. ఐతే కొన్ని "మలయమారుతాలు" "సంగీత శిఖరాలు" పుస్తకాలలో ఉన్నవి రిపీట్ ఐనాయి. ఇవి ముచ్చట్లు కాబట్టి అవి అలా అవడం సహజమే.
ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

సినిమాలు


పోరీలు పోరల వెనుక
పోరలు పోరీల వెనుక పోవుదు రెపుడున్ !
పోరు తరగతు కెన్నడు
తారల సినిమాకు దప్ప దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Tuesday, December 22, 2009

భాగ్యనగరం ఉద్యోగి


మండే ప్రొద్దున రద్దీ
గుండే వీథుల నగరము గుండా వెళుతూ ,
చెండాడుచు ట్రాఫిక్కును
దాడిచె ఆఫీసు చేరె దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Monday, December 21, 2009

నిన్న ఆదివారం సాయంత్రం...

నిన్న ఆదివారం సాయంత్రం, నేను నెక్లస్ రోడ్ లో జరుగుతున్నబుక్ ఫెయిర్ కు వెళ్ళడం జరిగింది. అబ్బో! ఎన్నో స్టాల్స్ ఉన్నాయి అక్కడ. ఇ - తెలుగు స్టాల్ లో తెలుగు వికిపీడియా మిత్రుడు , అంతర్వాహిని బ్లాగు రచయిత రవిచంద్ర గారిని కలవడం నాకు ఆనందం కలిగించింది . అలాగే ఇతర బ్లాగ్మిత్రులు చక్రవర్తి గారు , సుజాత గారు, సతీష్ గార్లు పరిచయమయ్యారు.

Saturday, December 19, 2009

గుట్కా,చిట్కా,మట్కా,జట్కా


గుట్కా నోట్లో నములుతు
చిట్కాలను కొన్ని చదివి చిటికెలు వేస్తూ !
మట్కాలో ఓడి, అలసి
జట్కాలో ఇల్లు చేరె జాఫరు హుస్సేన్.

కొడితే ....


కొడితే సిక్సే కొట్టుము
పుడితే పులిబిడ్డ వోలె పుట్టుము , ధరలో
పడితే కరినే పట్టుము
తడితే సింహాన్ని తట్టు, దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 16, 2009

పేర్లతో తమాషా !



శల్యుడు - బక్కచిక్కిపోయి ఎముకలు తేలినవాడు

శకుని - శస్త్రచికిత్సతో కుటుంబ నియంత్రణ

సైంధవుడు - టేబుల్ సాల్ట్ కు బదులు సైంధవ లవణము ఉపయోగించువాడు

దుశ్శాసనుడు - శాసన సభల్లో చీరలు లాగువాడు

శిశుపాలుడు - మగ బేబీ సిట్టర్

కర్ణుడు - చెవులాడు

నకులుడు - కులము లేనివాడు

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య


కోవెల వంటి మనసు తెలి
పూవుల వంటి పలుకు, విన మోదము లలరున్
మావుల ప్రసన్న వదనము
దవ్వుల నిలిచిననె చాలు దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago