ఈ రోజు "హైదరాబాద్ స్టడీ సర్కిల్ " హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం వారు జయంతి త్రైమాసిక పత్రిక - సామల సదాశివ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ముందు మాటలో సంపాదకులు శ్రీ వెలిచాల కొండల రావుగారు, శ్రీ కె. జితేందర్ బాబు గారు "ఈ సంచికను వెలువరించడంలో మేము ఆశించిన లక్ష్యం సదాశివ బహుముఖీనత్వాన్ని ఇంతవరకు తెలియని మన పాఠకులకు తెలియ జెప్పాలని మాత్రమే మా ప్రయత్నం" అని చెప్పుకున్నారు.
ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఉర్దూ సాహిత్యాన్ని గురించి, హిందుస్తానీ సంగీతం గురించి శ్రీ సదాశివ వ్రాసిన కొన్ని వ్యాసాలను చేర్చారు. రెండవ భాగంలో సదాశివ సాహిత్యంపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు, సదాశివ వ్రాసిన కొన్ని లేఖలను ప్రచురించారు. ఇక మూడవ భాగంలో సదాశివతో జరిపిన ఇంటర్వ్యూ ; అందులో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించారు. రమణజీవి కవర్ డిజైన్ చేయగా, అన్నవరం శ్రీనివాస్ కవర్ పెయింటింగ్ వేశారు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో శ్రీ బి. నరసింగరావు గారు, శ్రీమతి రావు బాలసరస్వతి గారు, అమ్మంగి వేణుగోపాల్ గారు, ఎలనాగ గారు, నాగరాజు రామస్వామి గారు, వి. ఆర్. విద్యార్థి గారు, దేవిప్రియ మొదలైన వాళ్ళున్నారు."నేనెరిగిన సదాశివ" అనే వ్యాసాన్ని అందించిన రావు బాల సరస్వతి సభాధ్యక్షులు శ్రీ పేర్వారం రాములు మరియు ఇతర పెద్దల కోరిక మేరకు రెండు గీతాల్లోని ( “నిండు పున్నమి పండు వెన్నెలలో "... మరియు "ఆ తోటలో నొకటి ఆరాధనాలయము ".. ) కొన్ని చరణాలు ఆలపించి ఆహుతులను అలరించారు.
2 వ్యాఖ్యలు:
సదాశివ గారి ముచ్చట్లు చదువుతుంటే జీవితమే తెలీదు. ఈ పుస్తకం ప్రాప్తిస్థానం చెబుతారా!
విశాలాంధ్ర బుక్ హౌస్ మరియు అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లో లభ్యం
Post a Comment