రాష్ట్రకూట వంశంలో జన్మించిన నృపతుంగుడు చక్రవర్తి, గుణశీలుడు మరియు న్యాయనిష్థ గలవాడు. న్యాయ మార్గంలో రాజు ప్రజలు అందరూ సమానులే అని అతని అభిప్రాయం. నృపతుంగుని కుమారుడు కృష్ణుడు. అతడు కోపిష్ఠి. తండ్రిని నిందిస్తూ ప్రజలను పీడించే వాడు. ఎప్పుడూ దుర్జన సాంగత్యంలోనే కాలం గడిపేవాడు.
అతడు ప్రౌఢ వయస్కుడవగానే శత్రుపక్షపు రాజు కుమార్తెను వివాహమాడి , వారి ప్రోద్బలంతో తండ్రి రాజ్యంపైనే దండెత్తాడు. నృపతుంగుడు ధీరుడు, శూరుడు. యుద్ధంలో కృష్ణుడు ఓడిపోయి , బందీగా చిక్కాడు. న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. రాజు న్యాయాధీశుడు, కృష్ణుడు అపరాధి. ' తీర్పు ఎలా ఉంటుందో' అని ప్రజలంతా కుతూహలంతో ఉన్నారు. 'నేను అపరాధినే' అని కృష్ణుడు అంగీకరించి, పశ్చాత్తాప పడ్దాడు. కృష్ణుడు స్వరాజ్య ద్రోహి కాబట్టి అతనికి మరణ దండనే యుక్తం అని రాజు తీర్పు నిచ్చాడు. ప్రజలంతా మౌనంగా వుండిపోయారు. " రాజు కొక్కడే కుమారుడు. అతడు లేకపోతే రాజ్యంలో అరాచకం ప్రబలొచ్చు. కాబట్టి అతడు జీవించి ఉండాలి" అని ప్రజలు కోరుకున్నారు. కుమారుణ్ణి క్షమించమని వారు రాజును ప్రార్థించారు. కాని రాజు అందుకు ఒప్పుకోలేదు.
చివరికి ప్రజల ఒత్తిడితో రాజు యువరాజును క్షమించి, " కుమారా! ప్రజలే నీకు ప్రాణభిక్ష పెట్టారు. కాబట్టి ప్రజా సేవయే నీ ప్రథమ కర్తవ్యం" అని అన్నాడు. అనతి కాలంలోనే కృష్ణుడు ప్రజలను వాత్సల్యంతో పరిపాలిస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.
" సుగంధ : సంస్కృత కథాసంగ్రహ:" నుండి
0 వ్యాఖ్యలు:
Post a Comment